తెలంగాణ ప్రజలపై మరో భారం

తెలంగాణ ప్రజలపై మరో భారం

తెలంగాణ డిస్కంలు నష్టాల ఊబి నుంచి గట్టెక్కలేకపోతున్నాయి. సర్కారు నుంచి సబ్సిడీ అందుతున్నా నష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో ఆర్థిక లోటు రూ.21,552 కోట్లకు చేరుతుందని రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాదికి సంబంధించిన ఆదాయ, వ్యయాల లెక్కలతో వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను రెండు సంస్థల అధికారులు మంగళవారం సాయంత్రం విద్యుత్తు నియంత్రణ మండలికి అందజేశారు.

ఈ సందర్భంగా ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బి.కృష్ణయ్యలతో కలసి ఆ వివరాలను వెల్లడించారు. డిస్కంలకు మొత్తం రూ.32,856 కోట్ల ఆర్థిక లోటు ఉంటుందని, ఇందులో రెండేళ్లకు కలిపి ప్రభుత్వ రాయితీగా రూ.11,304 కోట్లు వస్తాయని.. వెరసి లోటు రూ.21,552 కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డిస్కంల లోటు రూ.10,624 కోట్లుగా ఉంది.. మొత్తం రూ.45,618 కోట్ల మేర నిధులు అవసరమైతే అందులో వినియోగదారుల నుంచి బిల్లుల రూపంలో కేవలం రూ.29,343 కోట్ల మేర ఆదాయం మాత్రమే వస్తుందని, ఈ లోటు పూడ్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో రూ.5,652 కోట్లు వస్తుందని అంచనా వేసినట్టు నివేదికలో డిస్కంలు పేర్కొన్నాయి.

‘ఈ ఆర్థికలోటు పూడ్చాలంటే కరెంటు ఛార్జీలను డిస్కంలు పెంచాల్సిన అవసరముంది. పెరుగుతున్న డీజిల్‌, ఇతర ఇంధన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కరెంటు ఛార్జీలను సవరించాలని కేంద్రం కూడా ఆదేశాలిచ్చింది. అయితే ఛార్జీల సవరణ ప్రతిపాదనలను డిస్కంలు ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో ఈఆర్‌సీ ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపాదనలు ఇస్తే, వార్షిక ఆదాయ అవసరాల వివరాలను ప్రజల ముందు పెట్టి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా విచారించి మార్చి 31లోగా తుది ఆదేశాలు ఇవ్వగలం.’’ అని శ్రీరంగారావు వెల్లడించారు.