పుట్టిన రోజే ఆఖరి రోజు

పుట్టిన రోజే ఆఖరి రోజు

పుట్టిన రోజే ఆ యువకుడికి ఆఖరి రోజైంది. బర్త్‌ డే సందర్భంగా స్నేహితులతో కలిసి డిన్నర్‌ చేసి వస్తానని చెప్పి, ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరిన విషాద ఘటన హుజూరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హుజూరాబాద్‌ పట్టణంలోని ఆరెవాడకు చెందిన రాజూరి రాజు–అనిత దంపతుల కుమారుడు మణిదీప్‌ (22) మండలంలోని సింగాపూర్‌ కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

ఆదివారం తన పుట్టినరోజు కావడంతో మణిదీప్‌తోపాటు పట్టణానికి చెందిన అతని స్నేహితులు శివనాథుని సంకీర్త్, కటకం గోపీచంద్, గర్రెపల్లి సాయిచరణ్, మేరుగు రోహిత్‌లు కారులో ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్‌పేట సమీపంలో గల ఓ దాబాకు బయలుదేరారు. పర్కాల్‌ క్రాస్‌ రోడ్‌ సమీపంలో హుజూరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీని ఓవర్‌ టేక్‌ చేశారు.ఈ క్రమంలో ఎదురుగా వేగంగా వస్తున్న మరో లారీని ఢీకొట్టడంతో కారు ముందు సీట్లో కూర్చున్న మణిదీప్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

సంకీర్త్, గోపిచంద్, సాయిచరణ్‌లకు తీవ్ర, రోహిత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వారి కుటుంబీకులు వరంగల్‌ తీసుకెళ్లారు. అయితే ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మణిదీప్‌ తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ మాధవి తెలిపారు.