టాలీవుడ్ నటుడు అడివి శేష్ ఇటీవల గూఢచారి చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి కలెక్షన్లు వసూలు చేసింది. శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అడివి శేష్ కెరీర్ లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ హీరో త్వరలో మేజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ ఇన్స్పిరేషన్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మేజర్ చిత్రానికి గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
ఇక అడివి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పీవీపీ బ్యానర్లో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు మరోసారి పీవీపీ బేనర్లో అడివి శేష్ ఓ చిత్రం చేస్తున్నాడు. థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి ఎవరు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రెజీనా కసండ్రా కథానాయికగా నటిస్తుండగా, నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించనున్నారు. ఆగస్ట్ 23న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా ప్రీ లుక్ విడుదల చేశారు. ఇందులో అడివి శేష్ విక్రమ్ వసుదేవ్ బ్యాడ్జ్తో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ని జూలై 11న విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.