బాణాలతో దాడిచేసి మారణహోమం

బాణాలతో దాడిచేసి మారణహోమం

ఓ ఆగంతకుడు విల్లు ధరించి, బాణాలతో దాడిచేసి మారణహోమం సృష్టించిన ఘటన నార్వేలో చోటుచేసుకుంది. రాజధాని ఓస్లోలో దుండగుడు బాణాలను ఎక్కుపెట్టి దుకాణదారులపై జరిపిన దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అయితే బాణాలతో దాడికి తెగబడిన దుండగుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దుకాణంలోని ఓ మూల నిలబడి బాణాలను ఎక్కుపెట్టినట్టి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు దాడి అనంతరం సాయుధుడు ఆ ప్రాంతం నుంచి పారిపోగా అతడి ఆచూకీ కోసం దాదాపు 66 కిలోమీటర్ల మేర.. జల్లెడ పట్టినట్లు కాంగ్స్‌బర్గ్‌ పట్టణ పోలీసు ఉన్నతాధికారి వైవిండ్ ఆస్ పేర్కొన్నారు. దాడిలో ఐదుగురు చనిపోగా.. మరికొందరు గాయపడ్డారని తెలిపారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. క్షతగాత్రుల్లో పోలీస్ అధికారి ఒకరు ఉన్నారు. దాడి జరిగిన సమయంలో ఆయన అక్కడ ఉండటంతో బాణాలు తగిలి గాయపడ్డారు.

మరోవైపు.. దాడి ఘటనను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పిన ఓస్లో నగర మేయర్‌.. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఈ ఘటన జరిగిన తీరు బట్టి చూస్తే ఇది ఉగ్రవాద దాడి కాదని కొట్టిపారేయలేమని అన్నారు. అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘ఈ సమాచారాన్ని నిర్ధారించాలని మేము నిర్ణయించుకున్నాం.. ఎందుకంటే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు వ్యాపిస్తున్నాయి.. ఈ తీవ్రమైన చర్యలతో సంబంధం లేని కొంత మంది వదంతులను పుట్టిస్తున్నారు’ అన్నారు.