విశాఖలో మరోసారి గ్యాస్ లీక్… ఇద్దరు మృతి..

ఆంధ్రప్రదేశ్ లో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వైజాగ్ లోఆ మధ్య ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకై.. 12మంది మృత్యువాత పడ్డా ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. విషవాయువు లీకేజీతో మరోసారి విశాఖపట్టణం ఉలిక్కిపడింది. ఈసారి పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే గత రాత్రి 11:30 గంటల సమయంలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత సదరు కంపెనీ పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం అందుతుంది.

కాగా సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న కలెక్టర్ వినయ్‌చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన షిఫ్ట్ ఇన్‌చార్జ్ రాగినాయుడు, కెమిస్ట్ గౌరీశంకర్‌ల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్రశేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీ రామ్, ఎం.సూర్యనారాయణలను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద చేరడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.