హత్యలైపోయాయ్ ‘పరువు కిడ్నాప్’..కూతుర్ని ప్రేమించిన వ్యక్తిని కిడ్నాప్ చేసిన తండ్రి!

Girl Father Kidnaps His Daughter Lover

తన కుమార్తెను ప్రేమించడంతో పాటు ఆమె ఇంట్లో నుంచి పారిపోవడానికి కారణమయ్యాడన్న కోపంతో ఒక యువకుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు ఆడపిల్ల తండ్రి. అయితే పోలీస్ అధికారులు సరైన సమయానికి స్పందించడంతో ఆ యువకుడు కిడ్నాప్ కాకుండా బయటపడ్డాడు. దీంతో కిడ్నాప్ కు యత్నించిన అమ్మాయి తరపు వాళ్ళను దుండగులను పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. బెజావాడలో ఈ నెల 16న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు నగరంలోని చుట్టుగుంటకు చెందిన ఓ యువకుడు(18), ప్రసాదంపాడుకు చెందిన యువతి(17) గతంలో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ సమయంలో వారి మధ్య ప్రేమ పుట్టింది. ప్రస్తుతం యువకుడు పాలిటెక్నిక్‌, యువతి ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. వీరిద్దరి వ్యవహారం ఇరు కుటుంబాలకు ఇటీవల తెలియడంతో తెలిసితెలియని వయస్సులో ప్రేమ వ్యవహారాలు మాని సక్రమంగా చదువుకోవాలని హితవు పలికారు. అయినా వారు అలాగే మాట్లాడుకోవడంతో కొద్దిరోజుల కిందట యువకుడి తండ్రి కొడుకు ఫోన్ లోని సిమ్‌లు తీసేశారు. దీంతో అమ్మాయి ఫోన్ చేసేందుకు పలుమార్లు యత్నించినా వీలుకాలేదు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో ప్రియుడితో ఎలా మాట్లాడాలో అర్ధం కాని ఆ యువతి ఈ నెల 16న తల్లితో కలసి బయటకు వచ్చినప్పుడు తప్పించుకుని పారిపోయింది. . ఈ విషయాన్ని అమ్మాయి తల్లి తన భర్తకు చెప్పడంతో అతడు యువకుడి తండ్రికి ఫోన్‌చేసి నీ కొడుకే నా కూతుర్ని కిడ్నాప్ చేసాడని దూషించాడు. ఎలాగైనా మీ కూతురిని మీకు అప్పగిస్తామని చెప్పి యువకుని తండ్రి హామీనిచ్చాడు.

phone sim card
అనంతరం ఫోన్ లో సిమ్ కార్డు వేయగానే అమ్మాయి కాల్ చేసింది. ఎక్కడున్నావ్? అని ప్రశ్నించగా.. దుర్గగుడి వద్ద ఉన్నట్లు చెప్పింది. రాజీవ్ గాంధీ పార్క్ వద్దకు రావాల్సిందిగా అమ్మాయికి సూచించి ఆ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేశారు. అక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళాల్సిందిగా యువతీ తండ్రికి సూచించారు. ఆయన కూడా కొడుకు, అతని స్నేహితులతో కలసి అక్కడకు చేరుకున్నాడు.

fight
అయితే అక్కడకు చేరుకున్న అమ్మాయి బంధువులు యువకుడి తండ్రి, స్నేహితులతో వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. గొడవను గమనించిన జనాలు అక్కడ గుమికూడడంతో బలవంతంగా కొడుకునీ అతని స్నేహితుడిని యువకులిద్దరినీ కారులోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. దీంతో యువకుడి తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. నేతాజీ వంతెన సమీపంలో కారును అడ్డుకున్నారు. అనంతరం కిడ్నాప్ కు యత్నించినందుకు యువతి తండ్రి సహా 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 8 మందిని కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలించారు. ప్రేమికులిద్దరూ మైనర్లు కావడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచామని పోలీసులు చెబుతున్నారు.