వివాహమైన మరుసటి రోజే వరుడి మృతి

వివాహమైన మరుసటి రోజే వరుడి మృతి

విధి విలాసమో.. వైచిత్రమో తెలియదు కానీ వివాహమైన మరుసటి రోజే వరుడిని మృత్యువు బలితీసుకుంది. పచ్చటి తోరణాలు కళకళలాడుతుండగానే పెళ్లింట చావుడప్పు మోగింది. అటు వరుడు, ఇటు వధువు ఇళ్లలో విషాదాన్ని మిగిల్చిన ఈఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా తబకహొన్నళ్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శశికుమార్‌ పట్టణ శెట్టికి శనివారం అతని స్వగృహంలో హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా మూకబసరికట్టికి చెందిన యువతితో వివాహమైంది. తిరుగు పెళ్లిలో భాగంగా వధువు ఇంటికి నవదంపతులు వెళ్లారు. ఆదివారం శశికుమార్‌ గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. కళ్లముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసి అటు వధువు, పెళ్లికి వచ్చిన బంధువులు విషాదంలో మునిగిపోయారు.

వారం రోజుల క్రితం ఆ ఇంటిలో వివాహం జరిగింది. బంధువుల సందడి ఇంకా తగ్గలేదు. ఇంతలోనే కరోనా రూపంలో ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. కరోనాతో భర్త మృతి చెందగా భార్యకు, ఇటీవల వివాహం జరిగిన కుమార్తెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వివరాలు…బళ్లారిలోని విశాల్‌ నగర్‌లో ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ హనుమంతప్ప నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం అతని మూడవ కుమార్తెకు వివాహం చేశారు. పెళ్లికి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈక్రమంలో హనుమంతప్పకు కరోనా సోకింది. శనివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో విమ్స్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ హనుమంతప్ప ఆదివారం మృతి చెందాడు. కాగా హనుమంతప్ప భార్య, ఇటీవల వివాహమైన కుమార్తెకు కూడా పాజిటివ్‌గా తేలింది.