భారీ వర్షాలకు చెన్నై నగరం అతలాకుతలం

భారీ వర్షాలకు చెన్నై నగరం అతలాకుతలం

దీపావళి తర్వాత కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరం అతలాకుతలమయ్యింది. అయితే, వర్షం గురించి ముందస్తు హెచ్చరికలు చేసిన చైన్నై వాతావారణ కేంద్రం.. ఇంత స్థాయిలో భారీ వర్షం కురుస్తుందని మాత్రం పేర్కొనలేదు. కానీ, వాతావరణ విభాగం అంచనాలకు భిన్నంగా వర్షం కురవడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది. హెచ్చరికలు చేసిన కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు మించి చెన్నైలో 20 సెం.మీకిపైగా వర్షపాతం నమోదయ్యింది. 2015 తర్వాత చెన్నైలో ఈ స్థాయి వర్షం కురువడం ఇదే తొలిసారి.

దీనికి గల కారణాలను ఐఎండీ అధికారి వెల్లడించారు. ఈ అంశంపై వాతావరణ పరిశోధన కేంద్రం సౌత్‌జోన్‌ చీఫ్‌ బాలచంద్రన్‌ మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితి, గాలి దిశను పరిశీలిస్తున్నప్పుడు నవంబరు 6న చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలలో భారీ వర్ష సూచనలున్నట్టు హెచ్చరించామన్నారు. కానీ, చెన్నై నగరానికి భారీ వర్ష హెచ్చరికలు చేయలేదని తెలిపారు. నవంబరు 6న తక్కువ సమయంలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయిందని చెప్పారు. దీన్ని వాతావరణ పరిభాషలో ‘మెసొస్కేల్‌ ఫిలామినా’ అంటారని పేర్కొన్నారు.

దీన్ని ముందుగానే గుర్తించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. నుంగంబాక్కంలో 20 సెంటీమీటర్లు, మీనంబాక్కంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని, ఈ రెండు ప్రాంతాలకు మధ్య కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. కానీ వర్షపు తీవ్రత నమోదులో వ్యత్యాసం చూడవచ్చని చెప్పారు. పక్కపక్కన ఉన్న ప్రాంతాల్లోనూ తీవ్ర వ్యత్యాసంతో వర్షపాతం నమోదవడం ‘మెసొస్కేల్ ఫినామినా’ కిందికి వస్తుందని వివరించారు.

కాగా, నవంబరు 9న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో 9, 10, 11 తేదీలలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరానికి హెలికాప్టర్లు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5106 సురక్షిత శిబిరాలు సిద్ధంగా ఉంచారు.