కాన్పూర్‌లో మరో ఘోరం

కాన్పూర్‌లో మరో ఘోరం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల అమ్మాయిని ఆమె పనిచేసే కంపెనీ యజమాని అత్యాచారం చేయడమే కాకుండా పదో అంతస్తు నుంచి కిందకి తోసి హత్య చేశాడు. డీసీపీ మూర్తి గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లో డెయిరీని నిర్వహించే ప్రతీక్‌ వైష్‌ (40)అనే వ్యక్తి తన దగ్గర సెక్రటరీగా పని చేసే 19 ఏళ్ల అమ్మాయికి ఆఫీసు పని ఉందని మభ్యపెట్టి కళ్యాణ్‌పూర్‌లో ఉన్న తన ఫ్లాట్‌కి తీసుకువెళ్లాడు. ఇంటికి తీసుకువెళ్లాక తనతో సెక్స్‌ చేస్తే డబ్బులు ఇస్తానని ఒత్తిడి తెచ్చాడు.

దీనికి ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయమంతా పోలీసులకి చెబుతానని ఆమె గట్టిగా బెదిరించడంతో పదో అంతస్తులో ఉన్న తన ఇంటి బాల్కనీ నుంచి ఆమెని కిందకి తోసేశాడు. దీంతో ఆ అమ్మాయి మరణించింది. మొదట పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రతీక్‌ ప్రయత్నించాడు. ఆ తర్వాత పోలీసు విచారణలో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ప్రతీక్‌ని అరెస్ట్‌ చేసిన పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా అతనిని న్యాయమూర్తి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.