భర్త వేధింపులు. శానిటైజర్ తాగి భార్య ఆత్మహత్య

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. గత సంవత్సరం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంట హైదరాబాద్ కూకట్‌పల్లిలో కాపురం పెట్టారు. కట్నంకోసం భర్త తరుచూ వేధిస్తుండటంతో దీప్తి తట్టుకోలేక తాజాగా శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కట్నంకోసం వేధిస్తుండటంతో భార్య తట్టుకోలేకే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇది హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మేకల దీప్తి(18), దోనే అమర్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటూ.. 2019లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చేసి కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం ఉంటున్నారు. అమర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. దీప్తి ఇంట్లోనే ఉంటోంది.

కాగా కొంతకాలం సాఫీగానే సాగిన వీరి కాపురం తర్వత తర్వాత వరకట్న వేధింపులు వీరి మధ్య చిచ్చు పెట్టాయి. పుట్టింటి నుంచి కట్నం తీసుకు రావాలంటూ అమర్ భార్యను వేధించడం స్టార్ట్ చేశాడు. శారీరకంగా, మానసికంగా నానా రకాలుగా హింసించడం చేశాడు. కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. తాజాగా భర్త గొడవపడి కొట్టడంతో దీప్తి మనోవేదనకు లోనై మధ్యాహ్న సమయంలో అపార్ట్‌మెంట్‌ వాసులు వాడేందుకు ఏర్పాటు చేసిన శానిటైజర్ తాగేసింది. ఇది గమనించిన భర్త ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.