‘మత్తు వదలరా’ అంటున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు

‘మత్తు వదలరా’ అంటున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు

తెలుగు తెరపై మరో వారసుడి అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కొడుకు సింహా హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతను కథానాయకుడిగా తెరకెక్కిన తొలి సినిమా ‘మత్తు వదలరా’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను బుధవారం జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేశాడు. ఈ సినిమాతోనే కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా మారుతుండటం విశేషం.

కాలం వేగంగా ముందుకు సాగిపోతోందని.. తన సోదరులైన సింహా, కాలభైరవ చూస్తుండగానే పెద్దవాళ్లయిపోయారని.. వాళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ఫస్ట్ లుక్‌ను తాను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని తారక్ అన్నాడు. కీరవాణి కుటుంబంతో తారక్‌కు ఉన్న అనుబంధం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు అమితమైన అభిమానం చూపించుకుంటారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేతుల మీదుగా కీరవాణి కొడుకుల సినిమాల ఫస్ట్ లుక్ లాంచ్ కావడం సినిమాకు మంచి ప్రచారమే తెచ్చి పెడుతోంది. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే దాన్ని క్రియేటివ్‌గానే డిజైన్ చేశారు. మత్తెక్కి పడి ఉన్న కుర్రాడిగా సింహా లుక్‌ను పూర్తిగా రివీల్ చేయలేదు కానీ.. సినిమా కాన్సెప్ట్‌ను పోస్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం ఆకట్టుకుంది.

బ్యాగ్రౌండ్లో న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కనిపిస్తుండగా.. అందులో ఒక చోట ‘నూతన పరిచయం శ్రీ సింహా’ అంటూ పిల్లవాడిగా ఉన్న సింహా ఫొటో, పక్కన ఆశ్చర్యపోతున్నట్లుగా ఎన్టీఆర్ ఫొటోతో న్యూస్ ఆర్టికల్ ఆసక్తి రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న ఈ చిత్రంతో రితేష్ రాణా అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. కాన్సెప్ట్ బేస్డ్ మూవీలా కనిపిస్తున్న ‘మత్తు వదలరా’ ఈ ఏడాది నవంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.