అరుదైన మైలురాయిని క్రాస్‌ చేసిన స్టార్‌ ఆటగాడు

అరుదైన మైలురాయిని క్రాస్‌ చేసిన స్టార్‌ ఆటగాడు

టీ20 క్రికెట్‌లో విండీస్‌ పరిమిత ఓవర్ల సారధి, ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు కీరన్‌ పోలార్డ్‌ ఓ అరుదైన మైలురాయిని క్రాస్‌ చేశాడు. ఈ ఫార్మాట్‌లో 11వేల పరుగుల ల్యాండ్‌ మార్క్‌ను దాటిన రెండో బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్‌లో 554 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్‌(11,008).. కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్‌) 2021లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు.

ఈ జాబితాలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌.. 14,108 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ వెటరన్‌ ఆటగాడు షోయబ్ మాలిక్(10,741) మూడో స్థానంలో, ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌ డేవిడ్ వార్నర్(10,0017) నాలుగో ప్లేస్‌లో, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(9922) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. పోలార్డ్‌ బౌలింగ్‌లో 297 వికెట్లు పడగొట్టి.. పొట్టి క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ముఖ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.