స్థానిక ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో నూతన దర్శకుడు అజర్ రూపొందించిన ‘కొత్త సినిమా’ kotha cinema త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో దాదాపు 100 మంది కొత్త నటీనటులు భాగమయ్యారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, ఎడిటింగ్ వంటి కీలక బాధ్యతలను దర్శకుడు అజర్ స్వయంగా నిర్వర్తించారు.
మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింగరేణి ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా కొత్త నటీనటులను ప్రోత్సహించడంతో పాటు స్థానిక ప్రతిభకు మంచి వేదిక కల్పించే ప్రయత్నం చేశారు.
సినిమా ప్రమోషన్లో భాగంగా ‘వై ఇన్ హైదరాబాద్ వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ పేరుతో హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్. శంకర్, వీఎన్ ఆదిత్య, వీరశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
స్థానిక నటీనటులకు శిక్షణ అందించి, సింగరేణి ప్రాంతాన్ని నేపథ్యంగా ఎంచుకుని సినిమాను పూర్తి చేయడం దర్శకుడు అజర్ పట్టుదలకు నిదర్శనమని ఈ సందర్భంగా వక్తలు ప్రశంసించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఇలాంటి ప్రయత్నాలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
జానీ బాషా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించగా, పెద్దపల్లి రోహిత్ సంగీతాన్ని సమకూర్చారు. ప్రస్తుతం ‘కొత్త సినిమా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
