లాక్ డౌన్ ఉత్కంఠకు తెర… మరో రెండు వారాలు.. ఇంతే..

లాక్ డౌన్ ఎత్తేస్తారా? మరికొంత కాలం పొడిగిస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటి ఎన్నో సందేహాలతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉత్కంఠకు తెరపడింది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించింది. ఈనెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ ముగియడంతో అందరిలీ ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో కేసుల రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్ డౌన్ కొనసాగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు గత కొంతకాలంగా హెచ్చరికలు వస్తున్నాయి. మొదట్లో తక్కువ సంఖ్యలో నమోదైన కరోనా కేసులు ఆ తర్వాత ..మర్కజ్ ఘటనతో అమాంతం పెరిగిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో పరిస్థితి సీరియస్ గానే ఉంది. ఈ క్రమంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఇలాంటి కీలక సమయంలో లాక్‌డౌన్ పొడిగింపు, దేశంలోని పరిస్థితులపై ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్రమోడీ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించాలని ప్రధానిని కోరారు.

ఇదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో వేదికగా తమ భావాన్ని పంచుకొని ప్రజల ఉత్కంఠకు కాస్త తెరదించారు. ‘లాక్‌డౌన్‌ పొడిగింపు విషయంలో ప్రధాని నరేంద్రమోడీ సరైన నిర్ణయం తీసుకుంటారు.. వైరస్ వెలుగు చూసిన వెంటనే.. తొలిదశలోనే లాక్‌డౌన్ విధించడం వల్ల.. మిగతా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్‌ చాలా మెరుగ్గా ఉంది.. ఇలాంటి సమయంలో దీనిని ఎత్తివేస్తే ఇప్పటి వరకు దక్కిన ఫలితం వృథా అవుతుంది’ అని కేజ్రీవాల్ తెలిపాకు. కాగా మరో రెండు వారాల వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే ఆలోచనలోనే కేంద్రప్రభుత్వం ఉంది అని కేజ్రివాల్ స్పష్టం చేశారు.