ప్రాణం తీసిన ప్రేమ

ప్రాణం తీసిన ప్రేమ

ప్రియురాల్ని కలిసేందుకు వారి ఇంటికే వెళ్లి ఓ యువకుడు హత్యకు గురి అయ్యాడు. పొల్లాచ్చిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని చిన్న పాళయంకు చెందిన రాధాకృష్ణన్‌ కుమారుడు గౌతమ్‌. తల్లిదండ్రులు విడిపోవడంతో గౌతమ్‌ మానసికంగా బాధపడుతూ వచ్చాడు. అదే సమయంలో సూర స్వర పట్టి గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికతో ప్రేమలో పడ్డాడు. లాక్‌డౌన్‌ కారణంగా నెలన్నర రోజులు ఇంటికే పరిమితం అయ్యారు. ప్రియురాల్ని చూడలేక పరితపించిన గౌతమ్‌కు ఎట్టకేలకు చాన్స్‌ దక్కింది.

శనివారంతమ ఇంట్లో ఎవ్వరు లేదన్న సమాచారాన్ని గౌతమ్‌కు ఆ ప్రియురాలు పంపించింది. దీంతో ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఆ బాలిక తల్లి ఇంటికి రావడం, గదిలో ఎవరో మాట్లాడుకుంటుండటంతో ఆందోళన చెందింది. తక్షణం భర్త, కుమారుడు, తన తమ్ముడికి సమాచారం అందించింది. వారు ముగ్గురు గౌతమ్‌పై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేశారు. చనిపోతాడనే భయంతో అతడ్ని పోలీసులకు పట్టించారు. తమ ఇంట్లోకి చొరబడడంతో దాడి చేసినట్టు నాటకమాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్‌ మరణించాడు. ఆ బాలికను ప్రశ్నించగా గుట్టు రట్టయ్యింది. దీంతో హత్య కేసు నమోదు చేసిన పొల్లాచ్చి పోలీసులు ఆ బాలిక తండ్రి, సోదరుడు, మేనమామను సోమవారం అరెస్టు చేశారు.