భర్త చేతిలో హత్యకు గురైన మహిళ

భర్త చేతిలో హత్యకు గురైన మహిళ

పట్టణ పరిధిలోని తీగల్‌పహడ్‌ అల్లూరి సీతారామరాజు నగర్‌లో ఓ మహిళ సోమవారం భర్త చేతిలో హత్యకు గురైనట్లు నస్పూర్‌ ఎస్సై టీ శ్రీనివాస్‌ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన అలేఖ్య పాత మంచిర్యాలకు చెందిన పగడాల విజయ్‌కుమార్‌ 15 ఏళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. దంపతులకు శివాణి, రోహిత్‌కుమార్‌ సంతానం. విజయ్‌కుమార్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యను అనుమానిస్తూ చిత్రహింసలకు గురిచేసేవాడు. మూడు నెలల క్రితం అల్లూరి సీతారామరాజు నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

ఆదివారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెపై దాడిచేసి ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటినుంచి పారిపోయాడు. దాడిలో మహిళ మృతిచెందింది. దీంతో గమనించిన స్థానికులు మృతురాలి తల్లికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల రూరల్‌ సీఐ సంజీవ్‌ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి తల్లి సుధమల్ల రాధమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.