పెళ్లి పేరుతో మోసాలు

పెళ్లి పేరుతో మోసాలు

ఉద్యోగాలు చేసే మహిళలను మాయమాటలతో బుట్టలో వేసుకుని, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడిన ప్రబుద్ధుడికి న్యాయస్థానం తిక్క కుదిర్చింది. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగుర్ని పెళ్లి పేరుతో వంచించి.. వారి వద్ద నుంచి లక్షల్లో గుంజుకుని మొహం చాటేశాడు. ఆరు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుక్కి నాంపల్లి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. రంగస్వామి అనే వ్యక్తి వ్యవహారం ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

ఉద్యోగాలు చేసే మహిళలను రంగస్వామి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసగించి పెళ్లి చేసుకునేవాడు.ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మహిళల దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు గుంజుతూ తాను అనుకున్నంత దోచుకున్న తరువాత మొహం చాటేసేవాడు‌‌. ఈ విధంగా రంగస్వామి మాయలో పడి ఆరుగురు మహిళలు వంచనకు గురయ్యారు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో అతడి బాగోతం బయటపడింది.

ఆమె ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో రంగస్వామి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అతడి వలలో పడి ఆరుగురు మహిళలు మోసపోయినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించి.. చివరకు మూడు నెలల కిందట గోవాలో పట్టుుకున్నారు. గోవాలో జల్సాల్లో మునిగి తేలుతున్న రంగస్వామిని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ కస్టడీలో నిందితుడు నిజాలన్నీ కక్కేశాడు.

అతడిపై ఇప్పటి వరకు 12 కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసగించి, వారి దగ్గర లక్షల్లో డబ్బులు కాజేసినట్టు అంగీకరించాడు. ఆ సొమ్ముతో జల్సా చేసినట్టు ఒప్పుకున్నాడు. విచారణలో అతడి నేరాలన్నింటికీ సాక్ష్యాలు దొరకడంతో దోషిగా నిర్ధారించింది. పోలీసులు పక్కా ఆధారాలను సమర్పించడంతో నాంపల్లి కోర్టు విచారణ జరిపి రంగస్వామికి పదేళ్లు జైలుశిక్ష విధించింది.