విపరీతంగా పెరిగిపోయిన బాలికలపై అఘాయిత్యాలు

విపరీతంగా పెరిగిపోయిన బాలికలపై అఘాయిత్యాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. వరుస సంఘటనలతో ఆందోళన చెందుతున్న మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కొందరు ఆకతాయిగా చేస్తున్న ఫిర్యాదులతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌ నగరంలో వారం రోజుల వ్యవధిలో కలకలం రేపిన రెండు అత్యాచార ఘటనలను పోలీసులు అబద్ధమని తేల్చారు. అయితే ఆ ఘటనలు అసత్యమని అని తేలినా తెలంగాణలో నిత్యం ఏదొక చోట కామాంధులకు చేతుల్లో మహిళలు బలైపోతూనే ఉన్నారు.

తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరిపెడ మున్సిపాలిటీ పరిధి బొత్తలతండాకు చెందిన గిరిజన బాలికపై వరుసకు సోదరుడైన యువకుడు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. రెండు వర్గాలను పిలిచి పంచాయతీ నిర్వహించిన పెద్దలు బాలికకు రూ.8లక్షలు పరిహారం చెల్లించాలని తీర్మానం చేసినట్లు సమాచారం. డబ్బులు తీసుకుని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలయాలని పెద్దలు బాలిక కుటుంబాన్ని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.