నెడుముడి వేణు కన్నుమూత

నెడుముడి వేణు కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ లెజెండరి నటులు, నేషనల్‌ అవార్డు గ్రహిత నెడుముడి వేణు సోమవారం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తిరువనంత పురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కాలేయ వ్యాధి సంబంధిత సమస్యలకు చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం క్షిణించడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇక ఆయన మరణవార్త విన్న ఆయన సహా నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్‌ పార్వతిలతో పాటు మలయాళం, తమిళ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా నెడుముడి వేణు సినిమా విషయానికి వస్తే.. ఆయన చిన్న థియేటర్‌ ఆర్టిస్ట్‌గా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

ఇక 1978లో జీ అరవిందన్‌ దర్శకత్వంలో వచ్చిన థంబు చిత్రంలో ఆయన వెండితెర ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తమిళంతో పాటు దాదాపు 500 సినిమాల్లో నటించిన ఆయన తెలుగులోకి డబ్‌ అయిన కొన్ని తమిళ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు. తన అద్భుత నటనతో ఆకట్టుకునే ఆయన మూడు నేషనల్‌ అవార్డ్స్‌తో పాటు 7 రాష్ట్ర స్థాయి అవార్డులను దక్కించుకున్నారు.