హైదరాబాద్‌ మహిళలో ఒమిక్రాన్ లక్షణాలు

హైదరాబాద్‌ మహిళలో ఒమిక్రాన్ లక్షణాలు

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచానికి ఒమిక్రాన్ రూపంలో మరో ముప్పు మొదలైంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఇప్పటికే 25దేశాలకు వ్యాప్తి చెందింది. దీని ప్రభావంతో చాలా దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా ఇది ప్రభావం చూపుతోంది. తాజాగా భారత్‌లోనూ ఈ వైరస్ ప్రవేశించిందన్న వార్తలు భయపెడుతున్నాయి.

ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహిళలో ఒమిక్రాన్ లక్షణాలు గుర్తించినట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆమె శాంపిల్స్‎ను జినోమ్ సీక్వెన్స్‎కు పంపించినట్లు చెప్పారు. ఇటీవల కాలంలో విదేశాల నుంచి నగరానికి 325 మంది రాగా అందులో బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఆమెను టీమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లండించారు. అయితే నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల తరువాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 72 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా.. 239 తెలంగాణకు చెందిన వారని శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు.

ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఒమిక్రాన్ ముప్పు తలెత్తే అవకాశముందని, అందువల్ల ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాస్‌రావు సూచించారు. ఒమిక్రాన్ కట్టడిపై సీఎం అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనివారు.. రెండో డోస్‌ టీకా తీసుకోవాల్సిన వారు కచ్చితంగా వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని కోరారు. కొత్త వేరియంట్‌ ప్రవర్తన మనం పాటించే కొవిడ్‌ నిబంధనల మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. జనవరి లేదా ఫిబ్రవరిలో మరో ముప్పు రావొచ్చంటూ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు చూసి ప్రజలు భయపడొద్దని, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఒమిక్రాన్‌ను తరిమికొట్టొచ్చని పేర్కొన్నారు.

25 దేశాలలో 215 కరోనా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపిన శ్రీనివాసరావు.. ఆఫ్రికాలో సరిగ్గా వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే కొత్త వేరియంట్ పుట్టుకొంచ్చిందని తెలిపారు. తెలంగాణలో 90 శాతం మందికి మొదటి డోస్, 47 శాతం మంది రెండో డోస్ పూర్తయిందని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి 100శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, మాస్క్ వేసుకోకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు ఎక్కడికి వెళ్లినా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలని, బయటకు వచ్చేవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసేలా ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు తెలిపారు.