హైదరాబాద్ లో ఆసరా పెన్షన్ స్కామ్

హైదరాబాద్ లో ఆసరా పెన్షన్ స్కామ్

హైదరాబాద్‌లో ఆసరా పెన్షన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పాతబస్తీకి చెందిన నలుగురు వ్యక్తులు కొన్ని నెలలుగా 250 మంది వృద్ధుల పెన్షన్లను డైవర్ట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదుతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. కలెక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు… పాతబస్తీకి చెందిన ఇమ్రాన్, సొహెల్, అస్లాం, మోసిన్‌లను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అస్లాం సాయంతో నిందితులు ఈ స్కాంకు పాల్పడినట్టు తెలుస్తోంది. 2017లోనూ పెన్షన్ల స్కాంలో అస్లాం జైలుకు వెళ్లొచ్చినట్టు తెలుస్తోంది. అయినా అతడి తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు.

ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. వాళ్లు దొరికితే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్ని నెలల నుంచి ఈ స్కాం జరుగుతుంది ? ఇందులో ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ చేపట్టారు. పాతబస్తీలో అమాయక వృద్ధులను మోసం చేస్తూ ఈ ముఠా పెన్షన్లను కాజేస్తున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.