నీట మునిగిన ఇళ్ళు

నీట మునిగిన ఇళ్ళు

తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా ఆగకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షాలకు నిర్మల్, భైంసా పట్టణాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ పట్టణాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నిర్మల్ జిల్లాలో వరద తాకిడికి స్వర్ణ జలాశయం ఆరు గేట్లను ఎత్తేయడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగుకు సమీపంలో గల జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్‌లోని జీఎన్ఆర్ కాలనీలోకి వరద నీరు చేరి నీట మినిగింది. కాలనీలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఉదయం నుంచి తాగడానికి మంచినీళ్లు లేక, ప్రాణాలు రక్షించుకునేందుకు ఇళ్లపైకి చేరి బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు.నిర్మల్ పట్టణంలో పరిస్థితి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, జిల్లా ఇన్‌ఛార్జ్‌ ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఫైర్ ఇంజిన్, పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని తాళ్లు, తెప్పల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భైంసా సమీపంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తేశారు. దీంతో భైంసా ఆటోనగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఆటోనగర్‌, ఎన్‌.ఆర్‌.గార్డెన్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన దాదాపు 150 మందిని అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు రక్షించారు. భైంసా ఎన్‌.ఆర్‌.గార్డెన్‌లో బస చేసిన 20 మంది పోలీసులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో బోట్ల సాయంతో రక్షించారు.

నిర్మల్ జిల్లాలో పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మ‌రో 24 గంట‌ల పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా పనిచేయాలని నిర్దేశించారు. సహాయ‌క చ‌ర్యల కోసం నిర్మల్‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నామ‌ని తెలిపారు.