షూటింగుల్లో పాల్గొనడం అమ్మానాన్నలకు నచ్చడం లేదు

షూటింగుల్లో పాల్గొనడం అమ్మానాన్నలకు నచ్చడం లేదు

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం మోస్ట్‌ బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వస్తుండటంతో నిత్యం షూటింగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నేను వరుసగా షూటింగుల్లో పాల్గొనడం అమ్మానాన్నలకు నచ్చడం లేదు.

కరోనా ముప్పు పూర్తిగా తొలగకపోవడంతో కొన్నాళ్ల పాటు షూటింగ్‌లను వాయిదా వేసుకోమని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.కానీ నా వర్క్‌ విషయంలో ఎవరిని ఇన్‌వాల్వ్‌ కానివ్వను అన్న విషయం వాళ్లకు తెలుసు. పేరేంట్స్‌గా వాళ్లు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది కానీ షూటింగ్‌ షెడ్యూల్‌ మన చేతుల్లో ఉండదు కదా..అందుకే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులో పాల్గొంటున్నాను. కానీ నా బిజీ షెడ్యూల్‌ కారణంగా అమ్మానాన్నలు ఒకింత బాధపడుతున్నారు’ అంటూ రష్మిక ఎమోషనల్‌ అయ్యింది.

ఇక బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పనిచేయడం గురించి సంతోషం వ్యక్తం చేసిన రష్మిక.. అలాంటి గొప్ప నటుడితో కలిసి సుధీర్ఘంగా పనిచేయడంతో చాలా విషయాలు తెలుసుకునే అవకాశం దక్కిందని తెలిపింది. ‘పాత్రకు తగినట్లుగా ఎలా నటించాలి..సెట్‌లో ఎంత సరదాగా ఉండాలి అన్న విషయాలను ఆయన దగ్గరనుంచి నేర్చుకున్నా. నిజంగా బిగ్‌బి లాంటి లెజండరీ వ్యక్తితో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో `పుష్ప`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగుల్లో పాల్గొంటుంది.