రిషబ్‌ పంత్‌కు సోకిన కరోనా

రిషబ్‌ పంత్‌కు సోకిన కరోనా

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు కరోనా సోకినట్లు బీసీసీఐ దృవీకరించింది. అయితే ప్రస్తుతం పంత్‌కు కోవిడ్ లక్షణాలు లేవని పేర్కొంది. పంత్‌కు యూకే డెల్టా వేరియంట్ సోకినట్లు అనుమానంగా ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా రిషబ్‌ పంత్ మినహా మిగతా జట్టు డర్హమ్‌కు పయనం కానుంది.

అయితే ఇంగ్లండ్‌లో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం క్రికెటర్లు క్వారంటైన్‌లో ఉండనున్నారు. కాగా ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. కంట్రీ ఛాంపియన్‌షిప్‌ టీమ్‌తో ఈ నెల 20 నుంచి భారత్ జట్టు మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లను ఆడే విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకోలేదు. కాగా ఈ మ్యాచ్‌లకి పంత్ మాత్రం దూరంగా ఉండనున్నాడు.

కాగా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన 23 మంది టీమిండియా సభ్యుల బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని నేడు ఉదయమే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తన స్నేహితులతో కలిసి ఒక ఇంట్లో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి. ఇటీవలే యూరోకప్‌ 2020 లీగ్‌ మ్యాచ్‌లను చూడడానికి పంత్‌ తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను కూడా పంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

ఆ ఫోటోలలో పంత్‌ కనీసం మాస్క్‌ కూడా ధరించలేదు.. దీనికి తోడు మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో చాలా వరకు భౌతిక దూరం పాటించలేదు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బహుశా పంత్‌కు అక్కడే కరోనా వచ్చిన వ్యక్తి ఎదురయ్యుంటాడని.. అతనికి పాజిటివ్‌ రావడానికి యూరోకప్‌ అని ప్రధాన కారణం అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ అనంతరం టీమిండియాకి ఇటీవల 20 రోజుల బ్రేక్ ఇచ్చారు. దాంతో కొంత మంది భారత క్రికెటర్లు ఫ్యామిలీతో కలిసి అక్కడ పర్యాటక ప్రాంతాల్ని సందర్శించగా.. మరికొందరు వింబుల్డన్, యూరో కప్ మ్యాచ్‌లను స్టేడియంలోకి వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక తాజా సమాచారం ప్రకారం టీమిండియాకి కేటాయించిన హోటల్‌లో గత 8 రోజులుగా రిషబ్ పంత్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అక్కడే లండన్‌లో ఉన్న తన ఫ్రెండ్స్‌తో కలిసి రిషబ్ పంత్ హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పంత్ అక్కడే ఐసోలేషన్‌లో ఉన్నాడని.. టీమిండియాతో కలిసి అతను దుర్హామ్‌కి వెళ్లలేదని తేలింది. కంట్రీ ఛాంపియన్‌షిప్‌ టీమ్‌తో ఈ నెల 20 నుంచి భారత్ జట్టు మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. ఈ మ్యాచ్‌లకి పంత్ దూరంగా ఉండనున్నాడు.