ఈసారి జాగ్రత్త పడతానంటున్న తేజూ

Sai Dharam Tej Put Concentration on movie story

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు గత కొంత కాలంగా టైం బాగున్నట్లుగా లేదు. వరుసగా అరడజను చిత్రాలు ఫ్లాప్‌ అవ్వడంతో తేజూకు ఏం పాలు పోవడం లేదు. భారీ అంచనాల నడుమ తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తేజ్‌ ఐలవ్‌ యూ’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అంతకు ముందు వచ్చిన ‘విన్నర్‌’, ‘జవాన్‌’, ‘ఇంటిలిజెంట్‌’ ఇంకా కొన్ని చిత్రాలు కూడా ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో తేజూ విషయంలో మెగా ఫ్యామిలీ శ్రద్ద తీసుకోవాలని నిర్ణయించుకుంది. తేజూతో సినిమా తీయాలంటూ చిరంజీవి సోదరి స్వయంగా వెళ్లి అల్లు అరవింద్‌ను కోరినట్లుగా తెలుస్తోంది. దాంతో అల్లు అరవింద్‌ ప్రస్తుతం తేజూ కోసం ఒక కథను రెడీ చేయిస్తున్నాడు. మరో వైపు తేజూ తన తదుపరి చిత్రాన్ని కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

మంచి ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించగల సత్తా ఉన్న దర్శకుడు కిషోర్‌ తిరుమల. ఈయన తేజూ కోసం ఒక మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టులో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని భావించారు. కాని అనూహ్యంగా ఈ చిత్రాన్ని మూడు నెలలు ఆలస్యం చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో తేజూ కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో కూడా తేజూ ఒకే తరహా లుక్‌లో కనిపించాడు. కాని ఈసారి మాత్రం కొత్త గెటప్‌తో కనిపించేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ మూడు నెలల గ్యాప్‌లో తేజూ పూర్తిగా మారిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కొత్త లుక్‌తో పాటు, కొత్త కాన్సెప్ట్‌తో సినిమాను చేయాలని ఈ మెగా హీరో ప్రయత్నం చేస్తున్నాడు. కథ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని, కిషోర్‌ తిరుమలను ఇంకా బెటర్‌గా స్క్రీన్‌ప్లేను రెడీ చేయాల్సింది తేజూ చెబుతున్నాడు. ఈసారి అతి జాగ్రత్తతో తేజూ వ్యవహరిస్తున్నాడు. మరి ఈసారైనా ఈయనకు సక్సెస్‌ దక్కేనా చూడాలి.