షారుఖ్ తో సమంతా

షారుఖ్ తో సమంతా

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ప్రతి రోజు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. మొదట్లో ట్రోలింగ్‌ కారణంగా సోషల్‌ మీడియాలో నిలిచిన సమంత.. తాజాగా కెరీర్‌ పరంగా మరోసారి వార్తల్లోకెక్కింది. విడాకుల తర్వాత ఒక్కసారిగా సినిమా వేగాన్ని పెంచేసింది . ఇప్పటికే ఆమె గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్‌ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది.

దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ మరో బాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్‌, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ముందుగా నయనతార హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం మేరకు నయనతార ప్లేస్‌లో సామ్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకు చేరువైన సమంత.. ఈ సినిమాతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందట. అంతేకాదు ఈ సినిమా కోసం సమంత భారీ రెమ్యునరేషన్‌ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంతకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా దాదాపు రూ.7 కోట్లు పారితోషికంగా ఇవ్వడానికి నిర్మాతలు సిద్దమైనట్లు బీటౌన్‌లో చర్చ జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.