పునఃప్రవేశం కోసం శశికళ

పునఃప్రవేశం కోసం శశికళ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పూర్తిచేసుకుని వచ్చిన వీకే శశికళ తమిళనాడు ఎన్నికల ముందు రాజకీయాల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, రాజకీయ పునఃప్రవేశం కోసం శశికళ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను అధికారుల నుంచి ఆమెకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100కోట్ల విలువైన ఆస్తులను ఐటీ విభాగం జప్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడులోని పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జయలలిత తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న 1991-96 మధ్య ఈ ఆస్తులను శశికళ కొనుగోలు చేశారు. అప్పట్లో దాదాపు రూ. 20లక్షలతో కొనుగోలు చేయగా… ఇప్పుడు రూ.100కోట్ల వరకు ఉంటుందని అంచనా. కర్ణాటక ప్రత్యేక కోర్టు 2014లో ఇచ్చిన తీర్పులో ఈ 11 ఆస్తులను ‘‘ఆదాయానికి మించి ఆస్తులు’’గా పేర్కొన్నారు. ఈ తీర్పు ఆధారంగానే ఆస్తులను ఐటీశాఖ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.జయలలిత నెచ్చెలి అయిన శశికళ.. ఆమె మరణానంతరం అన్నాడీంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేజిక్కించుకోడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే అక్రమాస్తుల కేసులో తీర్పు వెలువడింది. ఆమెను దోషిగా నిర్ధారించి, న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.అనంతరం జరిగిన పరిణామాలతో శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది.బెంగళూరులోని పరప్పన అగ్రహారం కేంద్ర కారాగారంలో నాలుగేళ్లు జైలులో గడిపిన ఆమె… ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు.

కర్ణాటక నుంచి తమిళనాడుకు వస్తూ తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని ప్రకటించారు. అయితే, అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాలకు దూరంగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు. అయితే, మళ్లీ అన్నాడీఎంకేలోకి రావాలని ఆమె ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి.తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వమ్ సతీమణి విజయలక్ష్మీ అనారోగ్యంతో గతవారం చనిపోగా.. ఆయన నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు. నాలుగేళ్ల తర్వాత పన్నీర్ సెల్వంను శశికళ కలవడం ఇదే తొలిసారి. ఓపీఎస్‌ ఇంటికెళ్లిన ఆమె ఆయనను ఓదార్చారు.