కేసీఆర్‌ని టచ్ చేస్తే మసైపోతాం

కేసీఆర్‌ని టచ్ చేస్తే మసైపోతాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఎవరు టచ్ చేస్తే మసైపోవడం ఖాయమని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. కేసీఆర్‌‌‌ని టచ్ చేస్తామంటూ రెండ్రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మోత్కుపల్లి కౌంటర్ ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌, ఇతర నేతలు కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ని జైలుకు పంపుతామని సంజయ్ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన్ని టచ్ చేస్తే మాడిమసైపోతారని హెచ్చరించారు.

దళితబంధు పథకం అమలు కాకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని, ఆ పార్టీ నేతలను ప్రజలు ఊళ్లలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ వ్యతిరేకంగా డప్పుల దండోరా వేస్తామని ప్రకటించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశారని, అలాంటిది బీజేపీ నేతలు తెలంగాణలో ఉద్యోగాల కోసం మిలియన్ మార్చ్ నిర్వహించడం సిగ్గుచేటని మోత్కుపల్లి విమర్శించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అపవిత్ర కలయికతోనే ఈటల రాజేందర్ గెలిచారు. తన పార్టీకి ఓట్లు పడకుండా చూసిన పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి చెత్త రికార్డు నెలకొల్పారని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు.