వృద్ధురాలిని అనాథగా వదిలేసిన అల్లుడు

వృద్ధురాలిని అనాథగా వదిలేసిన అల్లుడు

వృద్ధురాలైన అత్తను ఓ అల్లుడు అనాథగా వదిలేసిన ఉదంతం శుక్ర వారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. చిత్తూరు జిల్లా గంగవరంలో ఫ్లయిఓవర్‌ బ్రిడ్జి కింద 75 ఏళ్ల వృద్ధురాలు రెండ్రోజులుగా అనాథగా ఉండడాన్ని శుక్రవారం స్థానికులు గమనించారు. తహసీల్దార్‌ బెన్నురాజ్‌కు సమాచారం ఇవ్వగా రెవెన్యూ సిబ్బందితో వచ్చి వివరాలను ఆరాతీశారు. వయస్సు మీరడంతో ఆమె సరిగ్గా చెప్పలేకపోయింది.

‘నా పేరు రాజమ్మ, స్వగ్రామం శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా నాయుడుపేట, నాకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరికీ వివాహాలై ఉద్యోగాలు చేస్తున్నారు. రెండ్రోజుల కిందట పెద్ద అల్లుడు కారులో తీసుకొచ్చి ఇక్కడ దించేసి వెళ్లిపోయాడు’ అని మాత్రమే తెలిపింది. దీంతో ఆమెను గంగవరం ప్రభుత్వం పాఠశాలకు తరలించి తహసీల్దార్‌ భోజన సౌకర్యాలను కల్పించారు. వృద్ధురాలు వివరాలను సరిగా చెప్పలేకపోతోందని, శనివారం కరోనా పరీక్షలు నిర్వహించి అనాథాశ్రమంలో చేర్చుతామని తహసీల్దార్‌ చెప్పారు. వృద్ధురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించి రప్పిస్తామని తెలిపారు.