పెళ్లి చేయలేదని… తల్లిదండ్రులను కొట్టి చంపిన కసాయి కొడుకు..

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా కొడుకు రాజ్‌కుమార్‌కు పెళ్లిమాత్రం కుదరడం లేదు. దీంతో తనకు పెళ్లి చేయాలంటూ అతడు రోజూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. తనకు పెళ్లి చేయడం లేదన్న కోపంతో ఓ కొడుకు కిరాతకుడిగా మారాడు. ఏకంగా కన్న తల్లిదండ్రులనే అతి కర్కశంగా చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది.

అయితే తిరువణ్ణామలై తండ్రాంపట్టు సమీపంలోని కుప్పంతాంగల్‌ గ్రామానికి చెందిన గోవిందస్వామి, మాంగణి దంపతులకు కొడుకు రామ్‌కుమార్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూలి పనులు చేసే గోవిందస్వామి ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశాడు. ప్రస్తుతం కొడుకు రామ్‌కుమార్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ.. ఏ సంబంధం కూడా కుదరడం లేదు. అందులో భాగంగా.. తనకు పెళ్లి చేయాలని అతడు రోజూ తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటున్నాడు. తాజాగా తెల్లవారుజామున్నే రామ్‌కుమార్‌ ఇంట్లో ఉన్న రుబ్బు రాయితో తల్లిదండ్రలను గోవిందస్వామి, మాంగణి తలపై కొట్టి చంపేశాడు. ఈ తర్వాత ఇంటికి తాళం వేసి తిరువణ్ణామలైకి సైకిల్‌పై వెళ్లాడు.

అయితే మరుసటి రోజు ఉదయాన్నే గోవిందస్వామి కుమార్తె తల్లిదండ్రులను చూసేందుకు వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉంది. కిటికీలో నుంచి చూడగా తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో ఆమె కేకలు వేయగా స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. దీనిపై సమాచారం అందుకున్న సాతనూర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రామ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.