సింగరేణి ఎస్‌ఆర్పీ 3 గనిలో ప్రమాదం

సింగరేణి ఎస్‌ఆర్పీ 3 గనిలో ప్రమాదం

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఎస్‌ఆర్పీ 3 గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతిచెందారు. బొగ్గు శిథిలాల కిందపడి మరణించిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ శిథిలాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌ ఇబ్బందిగా మారింది. మరో రెండు గంటల సమయం పట్టవచ్చని కార్మికులు చెబుతున్నారు. కాగా ప్రమాదంపై సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మొదటి షిఫ్ట్‌లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మైన్‌లో బొగ్గు వెలికి తీస్తుండగా 21 డీప్‌ 24 లెవెల్‌ వద్ద రూఫ్‌ కూలడంతో ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. కార్మికులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లక్ష్మయ్య, చంద్రశేఖర్‌ మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.