టీడీపీని నిండా ముంచిన జనసేన

TDP has been badly hit by the Janasena party

నిన్న వెలువడిన ఏపీ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా అయింది. జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ విపక్ష హోదా అయినా దక్కడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీ హోదా దక్కడం కొంతలో కొంత మెరుగని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ జనసేన వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తనకు లాభం కలుగుతుందని తమ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆయన భావించారు. కానీ జనసేన మాత్రం తెలుగుదేశం పార్టీనే ఘోరంగా దెబ్బ తీసింది వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి వీచిన గాలిలో టీడీపీ పరాజయం పాలైంది. అయితే, తెలుగుదేశం పార్టీకి సీట్లు గణనీయంగా తగ్గడానికి జనసేన కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ విజయం సాధించిన 32 చోట్ల అది సాధించిన మెజారిటీ కన్నా జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది. 2009లో ఎలా అయితే చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసిందో అదే రీతిలో ఈసారి జనసేన దెబ్బ తీసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 80 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. అక్కడ కాంగ్రెస్‌ సాధించిన మెజారిటీ కన్నా పీఆర్పీకి అధిక ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 5 వేల ఓట్ల లోపు ఓడిపోయిన స్థానాలు 28 దాకా ఉన్నాయి. ఈసారి యలమంచిలిలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీకి 4 వేల ఓట్లు ఆధిక్యం వచ్చింది. జనసేనకు 16,500 ఓట్లు వచ్చాయి. రామచంద్రపురంలో వైసీపీకి 5వేల ఓట్లు మెజారిటీ రాగా, జనసేనకు 17,592 ఓట్లు వచ్చాయితణుకులో వైసీపీ 1264 ఓట్లతో విజయం సాధించింది. జనసేనకు అక్కడ 35502 ఓట్లు పోలయ్యాయి. విజయవాడ వెస్ట్‌లో వైసీపీ 6వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేనకు 22,312 ఓట్లు వచ్చాయి. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ 1587 ఓట్లతో ఓడిపోగా జనసేనకు 4104 ఓట్లు పడ్డాయి. తిరుపతిలో వైసీపీ 708 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచింది. ఇక్కడ జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి 12వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అలా ఈసారి టీడీపీ ఓటమిలో జనసేన ముఖ్య పాత్ర పోషించిందని చెప్పాలి. చెప్పక తప్పదు.