మూడు కొత్త చిత్రాలు

three new films of manchu vishnu

గత సినిమాల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలకు కొంత విరామం తీసుకున్న మంచు విష్ణు మళ్లీ స్పీడు పెంచుతున్నారు. మూడు సినిమాలు చేయబోతున్నారు. ఇందులో ఒకటి హాలీవుడ్ సినిమా కావడం గమనార్హం. వీటితో పాటు ఏపీ రాజకీయాల ఆధారంగా ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. రెండు కొత్త చిత్రాలతో పాటు వెబ్‌సిరీస్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. విష్ణు, కాజల్ అగర్వాల్ జంటగా ఐటీ రంగ నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఓ యాక్షన్ డ్రామా సినిమా రూపొందనున్నది. 2800 కోట్ల రూపాయల దోపిడీ ఎలా జరిగిందనే పాయింట్‌తో జాతీయ అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నది.

ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే సుబ్బరాజు అనే నూతన దర్శకుడితో ఓ న్యూ ఏజ్ థ్రిల్లర్ సినిమా నిర్మించనున్నారు విష్ణు. ఈ చిత్రానికి మిరా రోడ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నిజజీవిత సంఘటనలతో రూపొందనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరలో విడుదలకానుంది. అలాగే విష్ణు హాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నారు. జెఫ్రెచిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఆంగ్ల చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నది. వాస్తవిక అంశాల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విష్ణు సతీమణి విరానికా నిర్మాతగా వ్యవహరించనున్నారు. వయామార్, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతున్నది. దీంతో పాటు పొలిటికల్ డ్రామా వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు విష్ణు.