ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

కంప్యూటర్ కాలంలోనూ ఊహాతీత శక్తులు, మూఢనమ్మకాలతో కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్నా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో మాత్రం వెనకబాటు కనిపిస్తోంది. కడుపులో నొప్పి వస్తే ఆస్పత్రికి పోవాల్సింది పోయి పసరు మందు కోసం పరిగెట్టి ప్రాణాలు పోగొట్టుకుంటున్న దారుణ పరిస్థితులు ఉన్నాయి. వైద్యం పేరుతో వింత చేష్టలకు పాల్పడడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.

కరకగూడెం మండలం అశ్వాపురపాడు వలస ఆదివాసీ గ్రామానికి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల కిందట బాబు పుట్టాడు. చిన్నారికి ఆరోగ్యం బాలేకపోవడంతో కడుపునొప్పి అనుకుని అదే గ్రామానికి చెందిన పసరు పోసే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. ఆ వ్యక్తి వైద్యమంటూ వింత చేష్టలకు పాల్పడడంతో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతున్నాడని చిన్నారి బొడ్డు చుట్టూ కొరికాడు. అంతటితో ఆగకుండా ఏదో పసరు మందు నోట్లో వేశాడు.

విషయం తెలుసుకున్న ఆశ కార్యకర్త మరుసటి రోజు ఉదయం చిన్నారి ఇంటికి వెళ్లింది. బాబు అనారోగ్యంగా ఉండడంతో వెంటనే కరకగూడెం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రెండు నెలల బిడ్డకు సరైన వైద్యం అందక మృతి చెందడం విషాదం నింపింది. వైద్యం పేరుతో పసికందు బొడ్డు చుట్టూ కొరకడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.