బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి

బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి

ఎదురుగా వస్తున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్‌ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం తాండూర్‌ పట్టణ కేంద్రంలోని వినాయకచౌక్‌ పసాలిగల్లికి చెందిన షేక్‌ అబ్రార్‌(23), సయ్యద్‌ ఉమర్‌ రిజ్వాన్‌లు ఆదివారం నగరంలోని ఓ విందుకు హజయ్యారు. సోమవారం తెల్లవారుజామున తాండూర్‌ బయలు దేరారు.

ఉదయం 5:30గంటలకు మండల పరిధిలోని గడిసింగాపూర్‌ సమీపంలో కొడంగల్‌ నుంచి పరిగి వైపు అతివేంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌నడుపుతున్న షేక్‌ అబ్రార్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సయ్యద్‌ ఉమర్‌ రిజ్వాన్‌కు తీవ్రగాయాలవ్వడంతో ఆయన్ను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అక్కడికక్కడే మృతి చెందిన అబ్రార్‌ మృతదేహం రోడ్డుపై పడటంతో వెనుక వస్తున్న వాహనాలు మృతదేహంపై నుంచి వెళ్లడంతో మృతదేహం నుజ్జునుజ్జయింది. మృతుల బంధువు షబ్బీర్‌ అహ్మద్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.