కాబోయే భార్యభర్తలు మృతి

కాబోయే భార్యభర్తలు మృతి

మరికొద్దినెలల్లో ఇద్దరూ మూడుముళ్లతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. కానీ విధి వైపరీత్యానికి బలయ్యారు. నీట మునిగి కాబోయే భార్యభర్తలు మృతి చెందారు. అంచెట్టి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకొంది. వివరాల మేరకు అంచెట్టి తాలూకా ఉరిగంకు చెందిన శివమాదన్‌ కొడుకు శివ, డెంకణీకోట అణ్ణానగర్‌కు చెందిన చిన్నరాజ్‌ కూతురు అభిలకు నిశ్చితార్థం జరిగింది. మే నెలలో పెళ్లి నిర్ణయించారు.

బుధవారం ఉరిగంలో మారియమ్మ జాతరలో పాల్గొనేందుకు అభి వెళ్లింది. గురువారం ఉదయం శివ, అభి దగ్గరిలోని వాగులో ఈతకెళ్లారు. అభి నీటిలో మునిగిపోతుండగా శివ ఆమెను రక్షించేందుకు యత్నించారు. ఇరువురికీ ఈతరాకపోవడంతో నీట మునిగి మృతి చెందారు. ఇరుకుటుంబాల వారి రోదనలు మిన్నంటాయి. అంచెట్టి పోలీసులు కేసు నమోదు చేశారు.