పెళ్ళైన వారానికే మొగుడిని చంపించిన భార్య…పాత లవర్ కోసమే

wife killed her husband
రోజూ వార్తల్లో వస్తున్నవి చూస్తుంటే ఒకప్పుడు పెళ్ళయితే అమ్మాయిలకి ఎలా రక్షణ లేదని అనుకునేవారో ఇప్పుడు అబ్బాయిల విషయంలో అదే భయపడాల్సి వస్తోంది. తాజాగా లవర్ కోసం పెళ్లి చేసుకుని వారం కూడా గడవక ముందే మొగుడిని చంపేసిందో నవవధువు. పెళ్లికి రెండేళ్ల ముందు నుండే ఒకతనితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న యువతి పెళ్లి కావడంతో ప్రియుడితో కలిసి ఉండలేనని భావించి అతడి సాయంతో భర్తను హత్య చేయించిన ఘటన ఎపీలోని తూగోజిల్లలో చోటు చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కరపకు చెందిన పేకేటి సూర్యనారాయణ(28) ఎంఎస్సీ చదివి మండపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి వేపకాయలపాలెం గ్రామానికి చెందిన నాగలక్ష్మితో ఈ నెల 15న వివాహం జరిగింది. మే 21వ తేదీ మధ్యాహ్నం భార్యతో కలిసి వేపకాలయపాలెంలోని అత్తారింటికి వెళ్లిన సూర్యానారాయణ సాయంత్రం వేళ ఓ పని ఉందని, 8గంటలకల్లా వచ్చేస్తానని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రయినా సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడి ఊరంతా వెతికినా లాభం లేకపోయింది. అయితే 22వ తేదీ ఉదయం పెనుగుదురు-పాతర్లగడ్డ మార్గంలో పంట పొలాల వద్ద సూర్యనారాయణ బైక్ కనిపించడంతో పాటు సమీపంలోనే అతని మృతదేహం లభించింది. తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేసి గడ్డి కప్పి ఉంచడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామంలో పలువురిని విచారించగా నాగలక్ష్మికి ఉన్న అక్రమ సంబంధం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ప్రియుడు రాధాకృష్ణను అదుపులోకి తీసుకు విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తమ అక్రమ సంబంధానికి భర్త ఎక్కడ అడ్డొస్తాడోనన్న ఆందోళనతో నాగలక్ష్మి సూచనతో సూర్యనారాయణను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు రాధాకృష్ణతో పాటు నాగలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.