తెలంగాణలో పెరుగుతున్న మద్యం షాపులు

తెలంగాణలో పెరుగుతున్న మద్యం షాపులు

నూతన మద్యం పాలసీ ద్వారా తెలంగాణలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2620కు పెరిగింది. అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కొత్త దుకాణాలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సోమవారం మహబూబ్‌నగర్‌లో మాట్లాడుతూ.. పేదలకు ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతోనే మద్యం దుకాణాలు కేటాయిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లా యూనిట్‌గా గౌడలకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం మద్యం దుకాణాలను సోమవారం అధికారులు కేటాయించారు. కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా దుకాణాలను ఎంపిక చేశాయి. ఈ నేపథ్యంలోనే గౌడలకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 ఇలా మొత్తం 756 మద్యం దుకాణాలను రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించారు. మిగిలిన 1864 మద్యం దుకాణాలు ఓపెన్‌ కేటగిరీలో ఉన్నాయి.

నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం దుకాణాల యజమానులకు పలు వెసులుబాట్లు కల్పించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గతంలో రెండు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సి ఉండగా, ఈసారి ఒకే బ్యాంకు గ్యారంటీ తీసుకుంటామని, దరఖాస్తు ఫీజు, లైసెన్స్‌ ఫీజు పెంచలేదని స్పష్టం చేశారు. ఏపీ, కర్ణాటకలతో పోలిస్తే తెలంగాణలో తక్కువగానే షాపులు పెరిగాయని తెలిపారు.

ఈ నెలాఖరుతో మద్యం పాలసీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త మద్యం పాలసీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ, లాటరీ ద్వారా కేటాయింపునకు సంబంధించిన టెండర్‌ నోటిఫికేషన్‌ మంగళవారం వెలువడే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్‌ వెలువడితే బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. 10 రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం రెండు రోజుల తర్వాత లాటరీ ద్వారా దుకాణాలను కేటాయిస్తారు.