భవనంపై నుంచి దూకి భార్య ఆత్మహత్య

భవనంపై నుంచి దూకి భార్య ఆత్మహత్య

భర్త ఇంటికి రావడం చూసి ఓ భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ముఖర్జీ నగర్‌లోని నిరంకారి కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌ భవనంలో 52 ఏళ్ల నేహ, ఆమె భర్త ధరమ్ వర్మ నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా ప్రస్తుతం వాళ్లిద్దరు అమెరికాలో నివసిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ దంపతులు విడిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నేహ బయటకు వెళ్లిన తన భర్తకు ‘ఐ లవ్‌ యు’ మెసేజ్‌ పెట్టింది. అతను ఇంటికి తిరిగి వస్తుండగా చూసి అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్తుపై నుంచి కిందకు దూకింది. వైద్యం కోసం ఆమెను ఆస్పత్రికి తరలించగా తీవ్రంగా గాయపడడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనంతా సీసీ కెమెరాలో రికార్డయింది. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని, మహిళ మొబైల్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. యూఎస్‌లో ఉన్న ఆమె కుమారుడు, కుమార్తె ఢిల్లీకి చేరుకున్న తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం జరపనున్నట్లు తెలిపారు.