భర్త ఫ్రెండ్ తో ‘ఆ’ సంబంధం…కొడుకుతో సహా భర్తను చంపి…

murder

ప్రియుడి మోజులో భర్త, కన్న కుమారుడిని హత్య చేసిందో యువతి. ఆపై ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త, కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ యువతి కటకటాలు లెక్క పెడుతోంది. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తాజ్‌పురా మందవేలికి చెందిన రాజా(25) రెండేళ్ల క్రితం దీపికను పెళ్లాడాడు. వీరికి ఏడాది వయసున్న ప్రినీష్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ నెల 13న ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దీపిక తన భర్త, కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో రాజా ఫోన్ నంబరు ఇవ్వాలని పోలీసులు అడిగారు. అతడు ఫోన్ తీసుకెళ్లలేదని, ఫోన్ ఇంట్లోనే ఉందని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు దీపక తడబడడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్త, కుమారుడిని తానే చంపేసి చెరువులో పూడ్చిపెట్టానని చెప్పడంతో పోలీసులే షాకయ్యారు. రాజా స్నేహితుడితో దీపికకు వివాహేతర సంబంధం ఉందని, వీరి హత్యకు అదే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీపికతో సంబంధం పెట్టుకున్న యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.