తొలి వన్డేలో యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌

తొలి వన్డేలో యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌

ముంబై జట్టు ఓమన్‌ పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (79 బంతుల్లో 82; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ హార్ధిక్‌ తామోర్‌(70 బంతుల్లో 51; 4 ఫోర్లు) రాణించడంలో ముంబై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఓమన్‌.. ముంబై కెప్టెన్‌ షమ్స్‌ ములానీ (3/45), శశాంక్‌ (2/27), అమన్‌ (2/26) ధాటికి 47.1ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది.

ఓమన్‌ బ్యాట్స్‌మెన్‌ ఖాలిద్‌ కైల్‌(84 బంతుల్లో 76; 4 ఫోర్లు, సిక్స్‌), ఖవర్‌ అలీ(73 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబై జట్టు 43.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓమన్‌ బౌలర్లలో షకీల్‌ ఖాన్‌, రఫీవుల్లా తలో 2 వికెట్లు, బిలాల్‌ షా, ఫయాజ్‌ భట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం జరుగనుంది.