సంచలనం రేపుతున్న మరో కులాంతర వివాహం

సంచలనం రేపుతున్న మరో కులాంతర వివాహం

తెలంగాణలోని మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో మారుతీరావు అనే వ్యాపారవేత్త ప్రణయ్‌ని కిరాతకంగా హత్య చేయించాడు. తదనంతర పరిస్థితుల్లో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వెలుగుచూసింది. కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంగా ఓ యువకుడిని యువతి కుటుంబసభ్యులు పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేయించారు. జులై 24న జరిగిన ఈ ఘటన యూపీలో తీవ్ర కలకలం రేపుతోంది.

గోరఖ్‌పూర్‌కు చెందిన అనీష్ కుమార్ చౌదరి, దీప్తి మిశ్రా అనే ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ పెద్దలకు చెప్పగా ముందు అంగీకరించలేదు. ఆ తర్వాత అనీష్ కుటుంబసభ్యులు అంగీకరించగా.. దీప్తి కుటుంబం మాత్రం తిరస్కరించారు. దీంతో అనీష్, దీప్తి కొద్దిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో దీప్తి కుటుంబసభ్యులు అనీష్‌పై పగ పెంచుకున్నారు.తమ కూతురిని అనీష్ కిడ్నాప్ చేశాడని దీప్తి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తామిద్దరం మేజర్లమని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని ఆ జంట ఓ వీడియో విడుదల చేశారు.

దీంతో ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, దీన్ని ఇక్కడితో వదిలేయాలని పోలీసులు చెప్పారు. దీంతో ఆ కుటుంబం మూడు నెలల పాటు సైలంట్‌గా ఉండిపోయింది. అయితే తమ కూతురిని పెళ్ళి చేసుకుని కుటుంబ పరువు తీశాడన్న కోపంతో దీప్తి కుటుంబసభ్యులు అనీష్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం గత నెల 24వ తారీఖున అనీష్‌ను నడిరోడ్డుపై పట్టపగలు దారుణంగా చంపేశారు. ఈ పరువు హత్య ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు 17 మందిపై హత్య కేసు నమోదు చేసి 8 మందిని జైలుకు పంపారు. మిగిలిన వారిని విచారిస్తున్నారు.

ఇలా పెద్దలు పరువు పేరుతో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంతో పాటు యువతి జీవితాన్ని బుగ్గిపాలు చేశారు.బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దీప్తి మిశ్రా, వేరే సామాజిక వర్గానికి చెందిన అనీష్‌ గోరఖ్‌పూర్‌లోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. దీప్తి సోషియాలజీలో ఎంఏ చేయగా.. అనీష్ యాన్సియంట్ హిస్టరీలో ఎంఏ చేశాడు. చదువు పూర్తయ్యాక ఇద్దరూ గ్రామ పంచాయతీ అధికారులుగా ఉద్యోగాలు సాధించారు. ఇద్దరికి కౌదిరమ్ బ్లాక్‌లో పోస్టింగ్ ఇచ్చారు.

మూడేళ్ల పాటు అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే విధి మాత్రం మరోలా తలంచింది.కులాంతర వివాహం ఇష్టంలేకే తన తల్లిదండ్రులు అనీష్‌ను హత్య చేశారని దీప్తి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మూడేళ్లకే భర్తను చంపేసి తన జీవితాన్ని సర్వనాశనం చేశారని కన్నీరుమున్నీరవుతోంది. తన భర్త ప్రాణాలు తీసిన వారిని తనకు అప్పగించాలని, వారిని తన చేతులతోనే తగిన శిక్ష విధిస్తానని భావోద్వేగానికి లోనవుతోంది.