మ‌రో ప్రేమోన్మాదం… ప్రియురాలిని కొట్టి చంపి…తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రియుడు

youth-madhu-kills-btech-sus

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణ‌లో ప్రేమోన్మాదుల దారుణాలు కొన‌సాగుతున్నాయి. హైద‌రాబాద్ లాలాగూడ సంధ్యారాణి ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోనూ అలాంటి ఘ‌ట‌న వెలుగుచూసింది. మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి వివాహానికి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఓ యువ‌కుడు ఉన్మాదిగా మారాడు. క‌లిసి బ‌తికే అవ‌కాశం లేద‌ని తెలియ‌డంతో క‌లిసి చ‌నిపోదామ‌ని ప్రేయ‌సిని బ‌తిమ‌లాడాడు. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోక‌పోవ‌డంతో అత‌ను క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించాడు. ప్రియురాల‌నిని కొట్టి చంపి, ఆ త‌ర్వాత తానూ ఉరివేసుకున్నాడు. మ‌రిన్ని వివరాల్లోకెళ్తే…. ముస్కాన్ పేట‌కు చెందిన 25 ఏళ్ల మ‌ధు హైద‌రాబాద్ లో ప‌నిచేస్తున్నాడు.

22 ఏళ్ల సుస్మిత ముస్కాన్ పేట‌కు స‌మీపంలో బీఈడీ చ‌దువుతోంది. వారిద్దరూ ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవ‌ల పెళ్లిచేసుకుందామ‌నుకున్నారు. అయితే కులాలు వేరుకావ‌డం, సుస్మిత పుట్ట‌గానే భ‌ర్త త‌నను వ‌దిలేసి వెళ్ల‌డంతో వారి వివాహానికి ఆమె త‌ల్లి వెంక‌ట‌మ్మ అంగీక‌రించ‌లేదు. దీంతో ఇద్ద‌రూ దూరంగా ఉంటున్న‌ట్టు న‌టించారు. ఈ క్ర‌మంలో గురువారం ఫ్రెండ్ వివాహానికి మ‌ధు సిద్ధిపేట వ‌చ్చాడు.

అనంత‌రం ఫోన్ చేసి సుస్మిత‌ను త‌న‌ను క‌లిసేందుకు ర‌మ్మ‌న్నాడు. అత‌ని మ‌న‌సులోని ఆలోచ‌న‌లు తెలియ‌ని సుస్మిత మామూలుగా క‌లిసేందుకు వ‌చ్చింది. త‌న వెంట కూల్ డ్రింక్, పురుగుల మందు తెచ్చిన మ‌ధు ఇద్ద‌ర‌మూ ఆత్మ‌హ‌త్య చేసుకుందామ‌ని కోరాడు. కూల్ డ్రింక్ లో పురుగుల‌మందు క‌లుపుకుని తాగి చ‌నిపోదామ‌న్నాడు. దీనికి సుస్మిత ఎంత‌మాత్ర‌మూ అంగీక‌రించలేదు. అత‌నితో విభేదించి.. అక్క‌డినుంచి వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌ప‌డింది. అంతే మ‌ధులో ఉన్మాది బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

ఆమె లేకుండా బ‌త‌క‌లేన‌న్న భావ‌న‌కు వ‌చ్చేసిన మ‌ధు… అలాగే ఆమె కూడా తాను లేకుండా బ‌తికి ఉండ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌లేదు. అక్క‌డినుంచి సుస్మిత‌ను వెళ్ల‌నీకుండా…ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బ‌ల‌కు ఆమె స్పృహ కోల్పోయింది. అంత‌టితోనూ మ‌ధు ఆవేశం చ‌ల్లార‌లేదు. స్పృహ‌లేకుండా ప‌డి ఉన్న సుస్మిత మెడ‌కు ఉరి బిగించి హ‌త్య‌చేశాడు. త‌ర్వాత అక్క‌డే తానూ ఉరేసుకున్నాడు. ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు ఈ విష‌యాన్ని స్నేహితుడికి చెప్పాడు. హుటాహుటిన స్నేహితులు వ‌చ్చేట‌ప్ప‌టికే ఇద్ద‌రూ విగ‌త‌జీవులుగా క‌నిపించారు. ఈ ఘ‌ట‌న జిల్లాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.