లేఖ రాసి విద్యార్థి అదృశ్యం

లేఖ రాసి విద్యార్థి అదృశ్యం

మీ జీవితంలో 17 ఏళ్లపాటు ప్రశాంతత దూరం చేసినందుకు నన్ను క్షమించండి. మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ ఓ విద్యార్థి లేఖ రాసి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు సమాచారం మేరకు… కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ చెరుకుపల్లి కాలనీకి చెందిన ఎ.శివుడు కుమారుడు ఎ.పునీత్‌(17) ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు.

సోమవారం ఉదయం నీట్‌ పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన పునీత్‌ రాత్రైనా తిరిగి రాలేదు. పునీత్‌ తండ్రి శివుడు కళాశాలకు వెళ్లి వాకబు చేయగా కళాశాల సిబ్బంది అక్కడకు రాలేదని తెలిపారు. పునీత్‌ రూంలో వెతకగా పునీత్‌ రాసిన ఉత్తరం లభించింది. దీంతో కంగారు పడిన పునీత్‌ తండ్రి సోమవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.