శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ నేతల మృతి మరికొందరు మిస్సింగ్ !

శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీలంక విహార యాత్రకని వెళ్లిన ఏడుగురు జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) నేతలు అదృశ్యమయ్యారు. ఏడుగురు జేడీఎస్‌ నాయకుల్లో ఇద్దరు చనిపోయినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండో విడత ఎన్నికల తర్వాత ఈనెల 20న ఈ ఏడుగురు నాయకులు శ్రీలంకకు వెళ్లారు. అక్కడి ద షాంగ్రిలా హోటల్‌లోని రెండు గదులు అద్దెకు తీసుకుని బస చేశారు. మృతి చెందిన వారిని కేజీ హనుమంతరాయప్ప, ఎం. రంగప్పగా గుర్తించారు. ఈ పేలుడు అనంతరం ఈ ఏడుగురి నేతల ఆచూకీ తెలియకుండా పోవడంతో ఆందోళన నెలకొంది. ఇద్దరు చనిపోయినట్లు తేలడంతో మిగతా వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అదృశ్యమైన వారిలో శివన్న, పుట్టరాజు, మునియప్ప, లక్ష్మీనారాయణ, మారేగౌడ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా జేడీఎస్‌ నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నేతల గల్లంతు తనను షాక్‌ గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.