మందేసి రెచ్చిపోయిన ఛానల్ యాంకర్…కేసు నమోదు !

ఈ ఏడాది ఐపీఎల్ లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య క్రికెట్ ప్యాన్స్‌కు ఊపు తెచ్చింది. ఈ మ్యాచ్‌లో లోకల్ జట్టు సన్‌రైజర్స్ 9వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్‌కు హాజరైన హైదరాబాదీలు ఓ వైపు ఈలలు కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటే కొంతమంది మాత్రం పీలకదాకా మద్యం తాగి మిగతా వారికి నరకం చూపారు. మ్యాచ్‌ను తిలకించేందుకు కార్పొరేట్‌ బాక్సు నెంబరు-ఎస్‌-22లో కూర్చున కొందరు యువత ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. ఫుల్లుగా మద్యం తాగి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ఇదే బాక్సులో కూర్చున్న ఇండియన్ ఫైనాన్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడు సంతోష్‌ ఉపాధ్యాయ్‌ (41)ను మ్యాచ్‌ చూడనివ్వకుండా విసిగించారు. ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయగా అమర్యాదగా ప్రవర్తించి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. మాదాపూర్‌ బాలాజీనగర్‌కు చెందిన ఓ టీవీ యాంకర్ చింతల ప్రశాంతి (32), అమీర్‌పేట వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌కు చెందిన కందూరి పూర్ణిమ (27), కె.ప్రియ (23), ప్రైవేటు ఉద్యోగి అయిన లక్కపల్లి సురేష్‌ (28), దిల్‌సుఖ్‌నగర్‌ వివేకానందకాలనీకి చెందిన వంటేరు శ్రీకాంత్‌రెడ్డి (48), నాగోల్‌ హరిపురి కాలనీకి చెందిన గుర్రం వేణుగోపాల్‌ (38)పై పోలీసులు కేసు నమోదు చేశారు.