కంటపడి పెట్టిస్తోన్న ఆఫ్గనిస్తాన్‌ ప్రజల ఆవేదన

కంటపడి పెట్టిస్తోన్న ఆఫ్గనిస్తాన్‌ ప్రజల ఆవేదన

అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశం అయినప్పటినుంచీ బాధాకరమైన వీడియోలు, హృదయవిదారక దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆందోళన దిగుతున్న ప్రజలు, వారిని అణచి వేసేందుకు తాలిబన్ల కాల్పుల ఘటనలకు తోడు, తాలిబన్ల చెరనుంచి తప్పించుకునేందుకు అఫ్గన్‌ వాసులు నరకాన్ని అనుభవిస్తున్నారు. ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తనువు చాలిస్తున్నారు. దేశం విడిచిపెట్టి ఎలాగైనా ప్రాణాలను దక్కించుకోవాలన్న వారి ఆరాటానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా తమ బిడ్డల్ని కాపాడమంటూ అఫ్గాన్‌ తల్లుల ఆవేదన పలువురిని కంటపడి పెట్టిస్తోంది. కాబూల్ విమానాశ్రయంలో ఒక వైపు అమెరికన్‌ దళాలు, మరోవైపు విమానాశ్రయం వెలుపల తాలిబన్ల దాడులుతో అఫ్గన్‌ పౌరులు అల్లాడిపోతున్నారు. వెళ్లిపోనివ్వండి.. గేట్లుతీయండి,లేదంటే తాలిబన్లు తమ తలను నరికి వేస్తారంటూ బుధవారం ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈసందర్భంగా వేలాదిగా తరలివస్తున్న వారిని నిలువరించేందుకు తాలిబన్లు ఇనుప కంచెలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో తమ పిల్లలతోసహా సరిహద్దులను దాటే ప్రయత్నాలు చేస్తున్న తల్లులు ఇక గత్యంతరం లేక పిల్లల్ని ఎలాగైనా రక్షించుకోవాలని నిర్ణయించారు. అందుకే కనీసం తమ బిడ్డల్నైనా రక్షించమంటూ బ్రిటీష్ సైన్యం వైపునకు పిల్లల్ని విసిరేస్తున్న దృశ్యాలు కలవరం రేపుతున్నాయి. బోరుమని విలపిస్తూ కాపాడండి అంటూ బ్రిటిష్ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. మరోవైపు ఈ ఘటనపై బ్రిటీష్ ఆర్మీ సీనియర్ అధికారి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.