ఏపీ సీఎం వైఎస్ జగన్ కి.. అమిత్ షా ఫోన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ పరిణామాలు ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటున్న పటిష్టమైన చర్యల్ని హోంమంత్రి దృష్టికి జగన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి మిలియన్‌ మందికి అత్యధిక టెస్ట్ లు జరిపిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సమాచారం అందుతుంది. ఇదే విషయాన్ని ఏపీ సీఎం కార్యాలయం సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా తెలిపింది.

అదేవిధంగా లాక్ డౌన్ తో వచ్చే ఇబ్బందులపై వివిధ రాష్టాలకు సంబంధించి అభిప్రాయాలను సేకరించేందుకు ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే.. ఏపీలో పరిస్థితులు.. కరోనా వైరస్ విజృంభణపై తీసుకుంటున్న పటిష్టమైన చర్యలు వంటి విషయాలను వైఎస్ జగన్ అమిత్ షాకు వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 20వ తేదీనుంచి కొన్నింటికి ఇచ్చిన సడలింపుల విషయం, వివిధ జోన్ లు రెడ్ జోన్, ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్ లుగా విభజించి ప్రత్యేక సడలింపులు, రూరల్ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ కి సంబంధించిన సడలింపులు వంటి అంశాలపై అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు వంటి విషయాలపై సుదీర్ఘంగా సీఎం వైఎస్ జగన్ హోం మంత్రి అమిత్ షాకు వివరించిట్లు తెలుస్తోంది.