జగన్‌ సమక్షంలో అమూల్‌తో ఎంవోయూ

జగన్‌ సమక్షంలో అమూల్‌తో ఎంవోయూ

సహకార డెయిరీ రంగంలో అంతర్జాతీయ కీర్తినార్జించిన ‘అమూల్‌’ సంస్థ ద్వారా రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు ఇకపై ఏపీలోనే తయారైన పాలు, బాలామృతాన్ని పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం నేడు అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం చేసుకుంది.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువకు అమూల్‌ శ్రీకారం చుడుతోంది. ఇది మంచి పరిణామం. వ్యవసాయానికి పాడి రైతులు తోడైతేనే గిట్టుబాటు ధర లభిస్తుంది. అమూల్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ సంస్థ. పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలే అమూల్‌కు యజమానులు.

ఇప్పటికే ప్రకాశం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కొనసాగుతోంది. కొత్తగా అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నాం. అనంతపురం జిల్లాకు ఇదొక మంచి శుభవార్త. పాడి రైతుకు లీటర్‌కు రూ. 5-20వరకు అదనపు ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అమూల్‌ వచ్చిన తర్వాత ప్రైవేట్‌ కంపెనీలు రేటు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. పాల సేకరణలో జరిగే మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాం’ అని సీఎం జగన్‌ అన్నారు.

వీరికి పౌష్టికాహారం రూపంలో గర్భిణీలకు 200 గ్రా. పాలతో పాటు పిల్లలకు రోజూ 100 గ్రా. పాలు, నెలకు 2.5 కేజీల చొప్పున బాలామృతం కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజే స్తోంది. ఇప్పటివరకు వీటిని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బెంగళూరు నుంచి నెలకోసారి టెట్రా ప్యాకింగ్‌ రూపంలో 1.07 కోట్ల లీటర్ల చొప్పున ఏటా 12.84 కోట్ల లీటర్ల పాలు, తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ సొసైటీ నుంచి ఏటా 48,692 మెట్రిక్‌ టన్నుల బాలామృతాన్ని అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నారు.పాలు కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిద్వారా ఆర్నెల్ల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 22.50 లక్షల మంది.. గర్భిణీ స్త్రీలు 7.50 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో మన పాడి నుంచి ఉత్పత్తి అయ్యే తాజా పాలతో పాటు రాష్ట్ర పరిధిలోనే ప్రొసెస్‌ చేసిన బాలామృతాన్ని అంగన్‌వాడీలకు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనివల్ల మన పాడి రైతులకు మేలు జరగడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చిన అమూల్‌ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం  చేసుకుంది.