పంజాగుట్టలో కాల్పులు…ఏపీ ఇంటలిజెన్స్ పోలీస్ పనే ?

పంజా గుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులతో గొడవపడి కాల్పులు జరిపిన వ్యక్తి ఓ పోలీస్‌ గా గుర్తించారు. ఏపీ రాష్ట్ర ఇంటలిజెన్స్ వింగ్‌‌లో శ్రీనివాస్ పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం పంజా గుట్ట ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన విషయం కలకలం రేపింది. ఇవాళ ఉదయం విధులు ముగించుకొని శ్రీనివాస్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. బస్సు దిగాల్సిన సమయంలో శ్రీనివాస్ కు అడ్డుగా ఇద్దరు ప్రయాణీకులు ఉన్నారు. దీంతో ఆ ప్రయాణీకులతో శ్రీనివాస్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే ఆయన కోపాన్ని ఆపుకోలేని శ్రీనివాస్ వెంటనే తన వద్ద ఉన్నసర్వీస్ రివాల్వర్‌తో బస్సులో కాల్పులకు దిగాడు.దీంతో ఆర్టీసీ బస్సు పై కప్పు గుండా బుల్లెట్ దూసుకెళ్లింది.ఈ విషయమై బస్సు కండక్టర్ నుండి పోలీసులు ఫిర్యాదు తీసుకొన్నారు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో శ్రీనివాస్ పనిచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఏపీ డీజీపికి కూడ తెలంగాణ పోలీసులు సమాచారమిచ్చారు.